
ఫీవర్లో ఏడుగురు, గాంధీలో 8 మంది
హైదరాబాద్ , వెలుగు: కరోనా లక్షణాలతో బుధవారం ఒక్కరోజే 15 మంది ఆస్పత్రుల్లో చేరారు. అందులో 12 మంది తమంతట తామే ఆస్ప్రతికి రాగా, మరో ముగ్గురిని ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ తర్వాత హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. ఆ ముగ్గురికి జ్వరం, జలుబు ఉండడంతో ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్లో పెట్టినట్టు ఫీవర్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. మిగతా 12 మందిలో కొంతమంది ఇటీవల చైనాకు వెళ్లి వచ్చినవారున్నారని, ఇంకొందరు వాళ్లకు సన్నిహితంగా మెలిగినవారు కావడంతో, అందరినీ ఐసోలేషన్ వార్డులకు షిఫ్ట్ చేసినట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వాళ్ల రక్త నమూనాలను టెస్టులకు పంపించినట్టు చెప్పారు. అంతకుముందు పుణేకి పంపిన శాంపిళ్ల రిజల్ట్స్ నెగెటివ్ వచ్చాయన్నారు. వైరస్ ప్రభావిత దేశాలైన చైనా, థాయ్లాండ్, హాంకాంగ్, మలేషియా, సింగపూర్ నుంచి తెలంగాణకు 3,736 మంది వచ్చారని అధికారులు వెల్లడించారు. ఇందులో 30 మందిని హోమ్ క్వారెంటైన్లో పెట్టామన్నారు. మరో 37 మందికి టెస్టులు చేయించగా, 25 మందికి నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయని, మిగతా వారి టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. కరోనా ప్రిపేర్డ్నెస్, మేడారం జాతర ఏర్పాట్లపై స్పెషల్ సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు.