సిటీలో 15 కరోనా అనుమానిత కేసులు

సిటీలో 15 కరోనా అనుమానిత కేసులు

ఫీవర్​‌‌లో ఏడుగురు, గాంధీలో 8 మంది

హైదరాబాద్ , వెలుగు: కరోనా లక్షణాలతో బుధవారం ఒక్కరోజే 15 మంది ఆస్పత్రుల్లో చేరారు. అందులో 12 మంది తమంతట తామే ఆస్ప్రతికి రాగా, మరో ముగ్గురిని ఎయిర్​పోర్టులో స్క్రీనింగ్​ తర్వాత హాస్పిటల్‌కు షిఫ్ట్​ చేశారు. ఆ ముగ్గురికి జ్వరం, జలుబు ఉండడంతో ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు ఫీవర్​ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. మిగతా 12 మందిలో కొంతమంది ఇటీవల చైనాకు వెళ్లి వచ్చినవారున్నారని, ఇంకొందరు వాళ్లకు సన్నిహితంగా మెలిగినవారు కావడంతో, అందరినీ ఐసోలేషన్ వార్డులకు షిఫ్ట్​ చేసినట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వాళ్ల రక్త నమూనాలను టెస్టులకు పంపించినట్టు చెప్పారు. అంతకుముందు పుణేకి పంపిన శాంపిళ్ల రిజల్ట్స్​ నెగెటివ్​ వచ్చాయన్నారు. వైరస్​ ప్రభావిత దేశాలైన చైనా, థాయ్​లాండ్​, హాంకాంగ్​, మలేషియా, సింగపూర్​ నుంచి తెలంగాణకు 3,736 మంది వచ్చారని అధికారులు వెల్లడించారు. ఇందులో 30 మందిని హోమ్​ క్వారెంటైన్‌లో పెట్టామన్నారు. మరో 37 మందికి టెస్టులు చేయించగా, 25 మందికి నెగెటివ్​ రిజల్ట్స్​ వచ్చాయని, మిగతా వారి టెస్ట్​ రిజల్ట్స్​ రావాల్సి ఉందని తెలిపారు. కరోనా ప్రిపేర్డ్​నెస్, మేడారం జాతర ఏర్పాట్లపై స్పెషల్ సీఎస్​ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు.