పంజాబ్​లో కల్తీ లిక్కర్​ తాగి.. 17 మంది మృతి

పంజాబ్​లో కల్తీ లిక్కర్​ తాగి.. 17 మంది మృతి
  • మరో ఆరుగురి పరిస్థితి విషమం
  • ఆన్​లైన్​లో మిథనాల్​ కొని కల్తీ లిక్కర్ తయారీ
  • తొమ్మిది మంది నిందితుల అరెస్టు

అమృత్‌‌‌‌సర్: పంజాబ్‌‌‌‌లోని అమృత్‌‌‌‌సర్ జిల్లా మజిథా బ్లాక్‌‌‌‌లో కల్తీ లిక్కర్ తాగి 17 మంది మృతిచెందారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు భంగాలి, పాటల్‌‌‌‌పురి, మర్రి కలాన్, తెర్వాల్ గ్రామాలకు చెందినవారు. మరో ఆరుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా, వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, బాధితులంతా రోజువారీ కూలీలుగా పనిచేసేవారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

 పోలీసులు ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత, ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అరెస్టైన వారిలో ప్రధాన సూత్రధారి పరబ్జీత్ సింగ్‌‌‌‌తో పాటు కుల్బీర్ సింగ్, సాహిబ్ సింగ్, గుర్జంత్ సింగ్, నిందర్ కౌర్ ఉన్నారు. నిందితులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో 50 లీటర్ల మిథనాల్ కొనుగోలు చేసి, నీటితో కలిపి కల్తీ లిక్కర్ తయారు చేసినట్లు తెలిపారు. ఈ లిక్కర్‌‌‌‌ను రెండు లీటర్ల ప్యాకెట్లలో కట్టి విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

ఈ మిథనాల్ ను సాహిబ్ సింగ్‌‌‌‌ సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ మజిథా డీఎస్పీ, ఎస్ఎచ్ఓలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సస్పెండ్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఘటనను “మరణాలు కాదు, హత్యలు” అని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేసియా, బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.