వికారాబాద్ జిల్లాలో ఇంటర్ అమ్మాయి కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటన కలకలం రేపింది. తాండూరు మండలం జీనుగుర్తి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఆదివారం (జూన్ 28) అర్థరాత్రి జరిగింది ఈ ఘటన. మహేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుండి దూకడంతో రెండు కాళ్లు, నడుము విరిగిపోయినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు.
అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో.. అందరు నిద్రిస్తున్న సమయంలో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. రెండో ఫ్లోర్ పైకి వెళ్లి నేరుగా కిందికి దూకేసింది. దీంతో నడుముతో పాటు రెండు కాళ్లు విరగడంతో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని కొట్టుమిట్టాడుతోంది.
గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి చెప్పడంతో.. వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం తాండూరు నుండి హైదరాబాద్ తరలించారు.
కావాలని కింద దూకిందా... లేదా ఎవరైనా తోసేసారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సెక్యూరిటీ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
