- రాజస్థాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో వికటించిన కంటి ఆపరేషన్లు
జైపూర్: రాజస్థాన్లో అతిపెద్దదైన సవాయ్మాన్సింగ్(ఎస్ఎంఎస్) ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్అనంతరం 18 మంది కంటిచూపు కోల్పోయారు. ఆపరేషన్ వికటించడంతోనే ఒక కంటి చూపును కోల్పోయామని బాధితులు ఆరోపించారు. వీరంతా రాజస్థాన్ ప్రభుత్వ చిరంజీవి హెల్త్ స్కీమ్ ద్వారా కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నారు. జూన్ 23న ఆపరేషన్ చేయించుకున్నానని, అనంతరం జులై 5వరకు కంటిచూపు బాగానే ఉందని ఆ తర్వాత జులై 6,7 మధ్య చూపు కోల్పోయినట్లు బాధితుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ చేసినా కంటిచూపు తిరిగి రాలేదని బాధిత వ్యక్తి వెల్లడించాడు. ఇన్ఫెక్షన్ కారణంగా కంటిచూపు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారని పేషెంట్ తెలిపాడు. బాధితులలో కొంతమందికి రెండుసార్లు ఆపరేషన్ చేసినా కంటిచూపు తిరిగి రాలేదని డాక్టర్లు తెలిపారు. పేషెంట్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.