ఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు

ఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్  ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05  సోమవారం రోజున  పూరీ – హౌరా మార్గంలో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరించబడిన ట్రాక్‌లపై వెళ్ళినట్లుగా అధికారులు తెలిపారు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9:30 గంటలకు బహనాగ బజార్ స్టేషన్‌ను దాటినట్లుగా వెల్లడించారు.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలంలో ఉన్నారని,   రైలు వెళ్ళినప్పుడు డ్రైవర్లకు ఆయన చేయి చూపినట్లుగా అధికారులు వెల్లడించారు.  

జూన్  4 అర్థరాత్రి ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.  రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్ పోర్టు నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కు బొగ్గుతో కూడిన గూడ్స్ రైలు ట్రాక్‌పై  వెళ్లింది. అయితే ప్రమాదం జరిగిన  స్థలం నుండి రైళ్లు తక్కువ వేగంతో వెళ్తున్నాయి.   రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి.

బెంగళూరు నుంచి బెంగాల్‌లోని హౌరాకు వెళ్తున్న యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. ఇంతలోనే ఆ మార్గంలో వస్తోన్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొట్టింది. 

దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు పట్టాలుతప్పి బోల్తాపడ్డాయి. అదే సమయంలో కోరమండల్‌ బోగీలు పక్కనున్న ట్రాక్‌పై గూడ్సు రైలు దూసుకొచ్చింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.