
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో సీసీఎస్ పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. సూర్యాపేటలోని ఎస్పీ ఆఫీసులో ఎస్పీ నరసింహ మంగళవారం (జూన్ 10) మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మోతె, ఆత్మకూరు (ఎస్ ) మండలాల పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్మేందుకు ముఠా యత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు.
రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపాడు బస్ స్టేజి వద్ద సోమవారం సీసీఎస్ పోలీసులు, ఆత్మకూరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన తండా నగేశ్120 ప్యాకెట్ల నకిలీ విత్తనాల గోనె సంచిని బండిపై పెట్టుకొని వెళ్తుండగా ఆపి విచారించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన పంది రాము నుంచి తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతానికి చెందిన బానోతు జయరాం షాపులో కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. జయరాంకు గుంటూరు జిల్లా బాలాజీనగర్కు చెందిన తరిగొప్పల శ్రీనివాసరావు సరఫరా చేస్తున్నట్టు తేలడంతో ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో తండా నగేష్, పంది రాము, బాణోతు జయరాం, తరిగొప్పుల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్కు పంపగా ఏ1 అరుణోదయ నకిలీ పత్తి విత్తనాల కంపెనీ ఎండీ మాగులూరి సాంబశివరావు, ఏ6 చెవుల నర్సింహులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మోతె మండలం రావిపాడులో వెలుగు శ్రీను ఇంట్లో అడ్వాన్స్ 333, అరుణోదయ కంపెనీ పేరిట 98 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి సీజ్ చేశారు.
నిందితుడు వెలుగు శ్రీనుకు బంధువైన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహనతో అధిక దిగుబడిని ఇచ్చే పత్తి విత్తనాలుగా నమ్మించి రైతులకు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరికి కర్ణాటకలోని నలుగునూర్ కు చెందిన తిరుమల్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం తిరుమల్ పరారీలో ఉన్నాడు. ఇద్దరి నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన 128 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. రెండు కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ లు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.