
కొత్త జడ్పీలకు ఉద్యోగుల కేటాయింపు సమస్యగా మారింది. ఉన్న కొద్ది మందిని ఎలా సర్థాలన్నదానిపై పెద్దాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల్లోనూ ఇదే చర్చ. ఇప్పుడున్నోళ్లు సరిపోరని, ఇంతకు రెండింతలు కావాలని ఉన్నతాధికారులు, పరిషత్ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 జిల్లా పరిషత్లుండగా ఇప్పుడవి 32కు చేరాయి. పాత జడ్పీల పదవీకాలం జులై 5 వరకు ఉంది. ఖమ్మం జడ్పీ కాలం మాత్రం ఆగస్టు 5 వరకూ ఉంది. దీంతో కొత్త జిల్లా పరిషత్ జులై 5 తర్వాతే ఏర్పాటవుతాయి.
ఫలితాల తర్వాత గైడ్ లైన్స్
వచ్చే నెల 4న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 7న ఎంపీపీ, 8న జడ్పీ చైర్లన్లను ఎన్నుకుంటారు. ఆ వెంటనే ఉద్యోగుల విభజనపై విధివిధానాలు ఖరారు చేస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పాత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను తాత్కాలికంగా కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ ప్రాతిపదికన కేటాయించారు. విధివిధానాలు ఖరారయ్యాక వీరినుంచి ఆప్షన్లు తీసుకునే
అవకాశం ఉంది. అయితే ఉమ్మడి జడ్పీల్లో పనిచేసిన ఉద్యోగులు దాని పరిధిలో విడిపోయే జడ్పీల్లోనే ఉద్యోగం ఆశిస్తున్నారు.
15 చిన్న జడ్పీలు
మొత్తం32 జిల్లా పరిషతుల్లో పదింటిలో15కు లోపే జడ్పీటీసీలున్నారు. అధికంగా నల్గొండ జిల్లాలో 33 జడ్పీటీసీలు ఉండగా, తక్కువగా మేడ్చల్లో ఐదుగురే ఉన్నారు. వరంగల్ అర్బన్, సిరిసిల్ల, నారాయణపేట, గద్వాల, జనగామ, భూపాలపల్లి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాలో 15 మందికిలోపే జడ్పీటీసీలున్నారు. ఈ జడ్పీల్లో తక్కువ మంది సిబ్బంది సరిపోతారని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడున్న సిబ్బందినే పంచాలి
‘జూన్లో ఎంప్లాయీస్ విభజనకు విధివిధానాలు ఖరారు చేస్తాం. ఇప్పుడున్న సిబ్బందినే 32 జిల్లా పరిషత్లకు పంచాలి. కొంతమందినైనా ఔట్ సోర్సింగ్లో తీసుకోవాలి. జడ్పీటీసీల సంఖ్యను బట్టే సిబ్బంది అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడున్న పోస్టుల్లో ఒకటి, రెండు పోస్టులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది’ అని పంచాయతీరాజ్ శాఖలో ఓ ముఖ్య అధికారి ‘వెలుగు’తో అన్నారు.