వరల్డ్ కప్‌లో భారత్ మహిళలకు తొలి ఓటమి.. 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

వరల్డ్ కప్‌లో భారత్ మహిళలకు తొలి ఓటమి.. 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

IND-W vs SA-W: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళల జట్టుకు సౌతాఫ్రికా గట్టి బ్రేక్ వేసింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత్‌పై దక్షిణాఫ్రికా మహిళల టీమ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇదే మొదటి ఓటమి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ షఫాలీ వర్మ, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించి విజయాన్ని అందుకుంది.

మొదట్లో సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చిన శ్రీచరణి: 
159 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లను మన తెలుగమ్మాయి శ్రీచరణి ఆరంభంలోనే గట్టి దెబ్బ కొట్టింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (20) దూకుడుగా ఆడుతున్న క్రమంలో శ్రీచరణి తన స్పిన్ మ్యాజిక్‌తో క్యాచ్ అవుట్ చేసింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అన్నరీ డెర్క్‌సెన్‌ను కూడా డకౌట్ చేసి పంపించింది. ఇలా వరుసగా రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కష్టాల్లోకి నెట్టింది. 

►ALSO READ | 200 మ్యాచ్‌లు.. ప్రత్యేక జెర్సీ, క్యాప్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్కి సన్మానం

మారిజన్ కాప్, తజ్మిన్ బ్రిట్స్ దండయాత్ర: 
కష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టును ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్, స్టార్ ఆల్ రౌండర్ మరిజానే కాప్ ఆదుకున్నారు. భారత బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. అరుంధతి రెడ్డి, శ్రీచరణి, ప్రేమ్ రావత్, నందని శర్మల ఓవర్లలో ఈ ఇద్దరు వన్-సైడ్ రచ్చ లేపారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 97 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఆఖర్లో షఫాలీ వర్మ బ్రేక్ వేసింది. హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న తజ్మిన్ బ్రిట్స్ (40) ను షఫాలీ అవుట్ చేసినప్పటికీ.. అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోంచి చేజారిపోయింది. 

మ్యాచ్ ఫినిష్ చేసిన మారిజన్ కాప్: 
తజ్మిన్ బ్రిట్స్ అవుట్ అయినప్పటికీ.. క్రీజులో పాతుకుపోయిన మారిజన్ కాప్ ఏమాత్రం తగ్గలేదు.. సెంచరీ దిశగా దూసుకెళ్తూ ఒంటిచేత్తో  మ్యాచ్‌ను ముందుకు నడిపించింది. భారత బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా 81 పరుగులతో అజేయంగా నిలిచి సౌతాఫ్రికాకు ఘన విజయాన్ని అందించింది. భారత బౌలర్లలో శ్రీచరణి 3 వికెట్లు తీయగా, షఫాలీ వర్మ ఒక వికెట్ దక్కించుకుంది.