
అమరావతి: గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో సోమవారం (మే 26) జరిగిన ఓ శుభకార్యానికి కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలనుంచి నుంచి పలు కుటుంబాలు హాజరయ్యాయి.
శుభకార్యానికి వచ్చినవారిలో 11 మంది యువకులు సమీపంలో ఉన్న గోదావరి నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇందులో 8 మంది యువకులు ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. స్థానికులతో కలిసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడకు చెందిన నలుగురు క్రాంతి (20), పాల్ (18), సాయి (18), సతీష్ (19), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్ (13), మండపేటకు చెందిన రోహిత్, శేరుల్లంకకు చెందిన మహేష్ నదిలో గల్లంతైనట్లు పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.