2016లో థాయ్ టైగర్ టెంపుల్ నుంచి తరలించిన పులుల్లో 86 మృతి
అంటు వ్యాధుల వల్లే: అధికారులు
ఫేమస్ థాయ్ టెంపుల్ నుంచి మూడేళ్ల కిందట కాపాడిన పులుల్లో దాదాపు సగం రోగాలొచ్చి చచ్చిపోయాయి. పులులను చంపి చర్మాలు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో మరో ప్రాంతానికి తరలిస్తే అక్కడ కూడా బతకలేకపోయాయి. అంటు వ్యాధులు, జన్యు సంబంధ, ఇన్ బ్రీడింగ్కు సంబంధించిన జబ్బులతో టైగర్లు మృతి చెందాయని అధికారులు చెబుతున్నారు. థాయ్లాండ్లోని కాంచనబురి ప్రావిన్స్లోని ‘టైగర్ టెంపుల్ (వాట్ ఫా లువాంగ్ టా బువా టెంపుల్)’ పులులకు పెట్టింది పేరు. వాటిని చూసేందుకే వేలల్లో పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. టైగర్లను లాభం కోసం, పెంచుకోవడం కోసం వాడుకోనంత వరకు గుడి తరఫున వాటిని సంరక్షించొచ్చని 2001లో థాయ్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2016 జూన్లో గుడి పరిధిలో అధికారులు 40 పులి పిల్లల అవశేషాలు, ఆవులు, జింకల కొమ్ములను ఫ్రీజర్లలో గుర్తించారు. గుడికొచ్చే పర్యాటకులకు పులి చర్మాలు, ఇతర జంతువుల కొమ్ములను అమ్ముకొని గుడి వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో 147 పులులను కాంచనబురి ప్రావిన్స్కు 90 కిలోమీటర్ల దూరంలోని రాట్చబురి ప్రావిన్స్లో ఉన్న రెండు బ్రీడింగ్ స్టేషన్లకు తరలించారు. ముగ్గురు సన్యాసులు సహా ఐదుగురిపై అధికారులు కేసు నమోదు చేశారు. తరలించిన ఆ పులుల్లో ఇప్పుడు 61 మాత్రమే బతికున్నాయి. 86 మృతి చెందాయని ఈ సోమవారం థాయ్ అధికారులు వెల్లడించారు. ఊపిరాడకపోవడం, కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల బిగ్ క్యాట్స్ చనిపోయాయని చెప్పారు. ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ కుక్కల్లో ఎక్కువగా కనబడుతుంటుందని, ఇప్పుడు పులులకు, ఇతర జంతువులకూ సోకుతోందని అన్నారు. తరలించిన పులులకు జరగరానిదేదో జరుగుతుందని ముందే ఊహించామని థాయ్ ఎన్జీవో వైల్డ్లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎఫ్ఎఫ్) డైరెక్టర్ ఎడ్విన్ విఎక్ చెప్పారు. పులి పిల్లలను, ఆడ పులులను వేరుగా ఉంచాలని చెప్పినా పట్టించుకోలేదని, చిన్న చిన్న బోనుల్లో వాటిని ఉంచడంతో రోగాలు వ్యాపించాయని అన్నారు.