అర్ధరాత్రి బార్ లో చొరబడి.. కాల్పులు జరిపి పరార్..

అర్ధరాత్రి బార్ లో చొరబడి.. కాల్పులు జరిపి పరార్..
  • యూఎస్ బార్ లో కాల్పులు.. నలుగురు మృతి

కన్సాస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కన్సాస్ సిటీలోని ఓ బార్ లో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అర్ధరాత్రి 1.27 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని అక్కడి పోలీసులు చెప్పారు. కన్సాస్ సిటీలోని టెకీలా కేసీ బార్ లో హఠాత్తుగా కాల్పులు జరిగాయి. క్షణాల్లో కాల్పులు జరిపిన వ్యక్తి పరారయ్యాడు.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో హ్యాండ్ గన్ బుల్లెట్ షెల్స్ దొరికాయని, దాడి చేసింది ఒకరా, ఇద్దరా అన్నది కూడా తెలియదని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

టెక్సాస్ లో ఇటీవలే రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 44 మంది వరకూ మరణించారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు విచ్చలవిడిగా గన్స్ అమ్మకాలకు చెక్ పెట్టే చట్టం తేవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.