హిందు దేవతలను కించపరిస్తే సహించం

హిందు దేవతలను కించపరిస్తే సహించం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ డిమాండ్ చేశారు. జోగులాంబ అమ్మవారిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందు దేవతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువులు సహించరన్నారు. రాజకీయాలు చేసుకోండి.. హిందు దేవతలను కించపరిస్తే సహించమని హెచ్చరించారు. గతంలో హిందుగాళ్ళు, బొందు గాళ్ళు అంటూ.. హిందువులను కించపరిచారని, కేసీఆర్ పై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. హిందూ దైవాన్ని కించపరిచిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ను ఆశ్రయిస్తామని పండరీనాథ్ తెలిపారు.

ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై పలు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ ఏదో చెబుతారని ఆశించామన్నారు. కానీ... కొన్ని దేవతల పేర్లు చెప్పి ప్రెస్ మీట్ అయిపోయింది.. వ్యాఖ్యానించారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్టయిల్ అని, ఏవో పేర్లు చెప్పి దండం పెట్టి వెళ్లిపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. దేవుడితోనే పెట్టుకున్న సీఎం కేసీఆర్ పతనం మొదలైందని బీజేపీ నేతలు విమర్శలు చేశారు.