జగిత్యాల జిల్లా: రెండేళ్ల కింద కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన తండ్రి జ్ఞాపకాల నుంచి బయటపడలేపోతోంది ఓ చిన్నారి. తండ్రి సమాధిపై కూర్చుని తొమ్మిదేళ్ల పాప వెక్కివెక్కి ఏడుస్తోంది. పాపను ఓదార్చడం స్థానికుల వల్ల కావడం లేదు. రెండేళ్ల క్రితం జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదంలో 65మంది చనిపోయారు. అదే ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన ద్యాగాల స్వామి కూడా మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తన తండ్రి మృతితో కూతురు అక్షిత తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రమాదం జరిగి నిన్నటికి రెండేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుకు చేసుకొని.. గత రెండు రోజులుగా సమాధి దగ్గరే కూర్చొని ఏడుస్తోంది చిన్నారి. తన తండ్రి సమాధిపై పూలు వేస్తూ అక్కడే ఉంటోంది. ఇది చూసి స్థానికులు కూడా కంటతడిపెట్టుకుంటున్నారు.