నందమూరి కుటుంబానికి శాపం ఉందా..? నందమూరి వంశానికి చెందిన వారు...ఎన్టీఆర్ వారసులు...రోడ్డు ప్రమాదాలు లేకపోతే...అనుమానాస్పద స్థితిలో..లేదా అనారోగ్య కారణాలతో ఎందుకు చనిపోతున్నారు..? అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత మరొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్రలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న.. గత 23 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పెద్ద ఎన్టీఆర్తో మొదలు..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించారు. అయితే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ ఎన్టీఆర్..అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణానికి చాలా కారణాలు ఉన్నాయి. నందమూరి తారక రామారావు అవమానభారంతోనే మరణించారని ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తులు చెబుతుంటారు.
హరికృష్ణ ఫ్యామిలీ...
2009లో టిడిపి తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్కు కారు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. సరైన సమయంలో చికిత్స అందించడంతో తారక్ మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. ఇక 2014లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2018లో ఆగస్టు నెలలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఎన్టీఆర్ కూతురు సూసైడ్..
నందమూరి తారక రామారావు కూతురు కంటమనేని ఉమామహేశ్వరీ ఆత్మహత్య చేసుకుని మరణించారు. గతంలో నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయాలపాయలైనట్టుగా వార్తలు వినిపించాయి.
ఎన్టీఆర్ తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలోనే..
ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అటు త్రివిక్రమరావు చిన్న కొడుకు హరిన్ చక్రవర్తి కూడా యాక్సిడెంట్లోనే మృతి చెందారు. మనుషుల్లో దేవుడు సినిమాతో హరిన్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 1986లో మామ కోడళ్ల సవాల్ తో హీరోగా మారారు. హరిన్ సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయావడం గమనార్హం. అంతేకాదు..ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు.
టాలీవుడ్లో నందమూరి హీరోలకు ఉండే క్రేజే వేరు. సినిమాలపరంగా..వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక్కొక్కరుగా ఆ కుటుంబాన్ని మృత్యువు మింగేస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి ఏదైనా శాపం తగిలిందా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.