లిఫ్ట్ ఇచ్చి మొబైల్, డబ్బులు లాక్కొని పరార్

 లిఫ్ట్ ఇచ్చి మొబైల్, డబ్బులు లాక్కొని పరార్
  • సెల్ ఫోన్ అమ్ముతూ దొరికిన దొంగ 
  • అరెస్టు చేసిన ఓయూ పోలీసులు

ఓయూ,వెలుగు:  రిటైర్డ్ ఎంప్లాయ్ కి లిఫ్ట్​ఇచ్చి సెల్ ఫోన్, నగదు లాక్కొని పారిపోయిన ఓ దొంగను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ. 1000, సెల్​ఫోన్​, హోండా యాక్టివా స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. శుక్రవారం ఓయూ డివిజన్​ ఏసీపీ  జగన్​మీడియాకు వివరాలు తెలిపారు. బోయిన్​పల్లికి చెందిన ఆంథోని ఫెలిక్స్(29) ప్రైవేట్ ఎంప్లాయ్ . కాగా జల్సాలకు అలవాటు పడిన అతడు ఈజీ మనీ కోసం అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వాళ్లను టార్గెట్​చేశాడు. హబ్సిగూడలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్​మెంట్​లో ఉండే గోపాల్ ఇస్రోలో సైంటిస్ట్ గా రిటైర్డ్ అయ్యారు. అతను బెంగళూరు వెళ్లేందుకు ఈనెల 6న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​కు వచ్చాడు.  రైలు లేట్​గా వస్తుందని తెలియడంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు గోపాల్​అర్ధరాత్రి 11గంటల సమయంలో స్టేషన్​బయట ఆటోకోసం వెయిట్​చేస్తున్నాడు.  

తన యాక్టీవాపై ఆంథోని వచ్చి తార్నాక వైపు వెళ్తున్నానని, రూ.200 ఇస్తే దింపేస్తానని చెప్పాడు. దీంతో నమ్మిన గోపాల్ బైక్ పై వెళ్లి తన ఇంటి వద్ద దిగాడు. ఫోన్​ద్వారా పేమెంట్ చేయగా కాలేదు. గోపాల్ తన జేబులోంచి డబ్బులు తీసి ఆంథోని ఇచ్చేందుకు లెక్కిస్తుండగా.. రూ.1700, సెల్​ఫోన్​లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితుడు ఓయూ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఆంథోని తార్నాకలో సెల్ ఫోన్ అమ్మేందుకు యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు  ఏసీపీ జగన్​ తెలిపారు.