భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం (జూలై 12) ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఆస్పత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆయనతో కొంతసేపు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా తీవ్రమైన నొప్పిని భరిస్తూనే కూటమి తరపున ప్రచారం చేశారు. ముంబయిలోని ధీరుబాయి అంబానీ ఆస్పత్రి డాక్టర్ల బృందం పవన్ కల్యాణ్కు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవలే సైనస్ సమస్యకు కూడా ఆయన ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా భుజం ఆపరేషన్ తర్వాత పవన్ కల్యాణ్ కోలుకుంటున్నారు.
