
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలని ఆ పార్టీ ప్లీనరీలో తీర్మానించారు. బుధవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో మొత్తం 13 తీర్మానాలను ప్రతిపాదించి.. బలపరిచారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రమే కొన్నందుకు అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. ధరల నియంత్రణకు డిమాండ్ చేస్తున్నట్లు మరో తీర్మానం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇంకో తీర్మానం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, బీసీ వర్గాలకు కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనాభాను లెక్కించాలని, తెలంగాణలో రిజర్వేషన్ శాతం పెంచాలని తీర్మానాలు చేశారు. కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం రిఫర్ చేయాలని ఇంకో తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కేంద్రం కాలరాస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నవోదయ స్కూళ్లు, మెడికల్ కాలేజీలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. దళితబంధు స్కీంను దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని మరో తీర్మానాన్ని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తీసివేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు.