
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సోమవారం (మే 26) ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025, మే 28న విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈకేసులో ఏసీబీ నిందితులుగా చేర్చింది.
ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డితో పాటు ఈ కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. అప్పట్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. గత కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సెలైంట్ మోడ్లో ఉంది.
కవిత కేసీఆర్కు రాసిన లేఖతో ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకేసారి బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.