- ఏసీబీ దర్యాప్తులో బయటపడిన డీఈ ముత్యం వెంకటరమణ ఆస్తుల చిట్టా
- 2006 నుంచే కన్స్ట్రక్షన్ దందాలోకి..
- ముత్యం పేరిట మూడు, ప్రైడ్ హోమ్స్ పేరిట మరో కంపెనీ ఏర్పాటు
- హైటెక్ సిటీ పరిసరాల్లో కోట్లు విలువ చేసే భారీ నిర్మాణ ప్రాజెక్టులు
- ఏడంతస్తులకు పైగా ఉన్న 10 అపార్ట్మెంట్లు, 2 కమర్షియల్ కాంప్లెక్సులు
హైదరాబాద్, వెలుగు: ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం అండ్ ఏఎస్ఎన్ఆర్ లైఫ్ స్పేసెస్.. బినామీల పేరిట ప్రైడ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవే కాదు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్మెంట్లు, ఏడంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు. ఇవన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన తెలంగాణ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) ఖైరతాబాద్ డివిజనల్ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ ఆస్తులు. ఇంజినీర్గా సంపాదించిన అవినీతి సొమ్ముతో కొండాపూర్, మూసాపేట్, కూకట్పల్లిసహా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన 10 అపార్ట్మెంట్లే దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువ చేస్తాయని ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. వీటికి భార్య, మామను, ఇద్దరు పిల్లలను డైరెక్టర్లుగా చూపడంతో బినామీల పేరిట పలు ఆస్తులు కూడబెట్టినట్లు బయటపడింది. ఈ మేరకు వెంటకరమణ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆయన ఆదాయం ఖర్చులు పోను మిగిలిన సేవింగ్స్.. ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నిందితుడిని గురువారం చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్లోనే విధులు, కలెక్షన్
ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరమణ(56) కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. వెంకటరమణకు 1999లో స్వప్నతో వివాహం జరిగింది. ప్రస్తుతం కొండాపూర్ హైటెక్స్ సమీపంలోని మీనాక్షి స్కై లాంజ్ పోలారిస్- టవర్స్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సాయి సత్విక(25) ఐఐటీ వెల్లూరులో చదువుతుండగా కొడుకు వెంకట సాయి రిత్విక్(19) సిటీలోనే ఉన్నాడు. వెంకటరమణ 1992 ఆగస్టు 22న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. అప్పటినుంచి 1993 ఆగస్ట్ 21 వరకు ఎర్రగడ్డ, విద్యుత్ సౌధలో ట్రైనీగా పనిచేశాడు. ఈ క్రమంలోనే ఎంసీహెచ్లో మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్గా, ఆల్విన్ ఎస్ఎస్ లైన్స్, సేల్స్ అండ్ పర్చేజెస్తో పాటు మోతీనగర్ సెక్షన్ డివిజన్ కార్యాలయాలలో రెగ్యులర్ ఏఈగా విధులు నిర్వహించాడు. 2013 అక్టోబర్ 18న డివిజనల్ ఇంజనీర్గా మెహిదీపట్నం సెంట్రల్ సర్కిల్లో డీఈ ఆపరేషన్స్గా, సైబర్ సిటీ సర్కిల్లో డీఈ టెక్నికల్గా పనిచేశాడు.
ముచ్చటగా మూడు కంపెనీలు
ఉద్యోగంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో వెంకటరమణ 2006 లో కన్స్ట్రక్షన్స్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేపడుతూ, కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీఈగా తన పరిధిలో ఉన్న పర్మిషన్లు, బిల్స్ క్లియరెన్స్ సహా ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసేవాడు. ఇలా విద్యుత్ శాఖలో డీఈగా ఇతర హోదాలలో పనిచేస్తున్నప్పుడు వివిధ మార్గాల ద్వారా అవినీతికి పాల్పడ్డాడు. వీటిలో ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం అండ్ ఏఎస్ఎన్ఆర్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీలను ఏర్పాటు చేశాడు. వీటికి ఆయన భార్య స్వప్న తండ్రి శివరామ్ బాబును, కొడుకు నిఖిల్లను డైరెక్టర్లుగా అపాయింట్ చేశాడు. జి రవికుమార్ అనే వ్యక్తి పేరిట ‘ప్రైడ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను కూడా ప్రారంభించాడు. వీటి ద్వారా కూకట్పల్లి, మూసాపేట ప్రాంతంలో 10 రెసిడెన్సియల్ అపార్ట్మెంట్లు, 2 కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించాడు.
నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీలు,10 అపార్ట్మెంట్లు
నిందితుడు గతంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 డిసెంబర్ 12న రూ.25 వేలు లంచం తీసుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసులో 2022 ఫిబ్రవరి 1వ తేదీ వరకు సస్పెన్షన్లో ఉన్నాడు. అనంతరం తెలంగాణ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డివిజనల్ ఇంజనీర్గా నియమితులయ్యాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తన సర్వీసు కాలంలో జీతభత్యాలకుగాను రూ. 4,09,36,565 విలువైన స్థిరచరాస్తులను సంపాదించాడు. తాజాగా ఏసీబీ తనిఖీ చేసిన సమయంలో అతని ఆదాయం సుమారుగా రూ. 6.90 కోట్లు కాగా, వివిధ రకాల ఖర్చులు సుమారుగా రూ. 20.35 కోట్లుగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయ వనరుల కంటే రూ.17.54 కోట్లు విలువ చేసే ఆస్తులు అదనంగా ఉన్నాయి. వీటితో పాటు 10 అపార్ట్మెంట్లు, నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు మొత్తం కలిపి ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
