బోయిన్పల్లి స్టేషన్లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడిన SI నందిత

బోయిన్పల్లి స్టేషన్లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడిన SI నందిత

సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 2026 మే 20న నిర్వహించిన ఈ రైడ్స్ లో ఎస్సై నందిత లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ACB DSP గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో.. ఎస్సై నందితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ బాధితుడి కేసు విషయంలో లంచం ఇస్తేనే కేసు ముందుకు వెళ్లేందుకు సహకరిస్తానని ఎస్సై నందిత చెప్పారు. స్టేషన్లో ఉన్నతాధికారులకు నచ్చ చెబుతానంటూ 30 వేల రూపాయలు డిమాండ్ చేశారు.  లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

►ALSO READ | వనస్థలిపురంలో దారుణం... అక్కతో గొడవ పడుతున్నాడని.. బావను చంపిన యువకుడు...

ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు లంచం ఇచ్చాడు. ఈ క్రమంలో 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా నిఘా ఉంచి ఏసీబీ అధికారులు మహిళా ఎస్సై నందితను డైరెక్ట్ గా పట్టుకున్నారు.. ఈ వ్యవహారంలో సీఐ తో పాటు మరికొంత మంది  సిబ్బందిని విచారించారు ఏసీబీ అధికారులు. వారి ప్రమేయం లేదని తెలియడంతో నందిత క్యాబిన్ తో పాటు ఇతర పత్రాలను తనిఖీ చేసి కీలక ఆధారాలు సేకరించారు. 

  • ఏం జరిగిందంటే..

 ప్రేమ వివాహం చేసుకున్న బాధితుడు, ప్రేమించిన అమ్మాయితో ఉండడానికి ఇటీవలే పోలీసులు ఆశ్రయించాడు. అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ఎస్ఐ నందిత , అబ్బాయిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. టేబుల్ పైన డబ్బులు పెడితేనే కేసులు పరిష్కరిస్తానంటూ బాధితుడు అభిషేక్ కు బెదిరించారు. డబ్బులు ఇవ్వనంటూ అభిషేక్ వెళ్లిపోవడంతో.. అబ్బాయికి అమ్మాయికి మధ్య గొడవ పెట్టించి, అమ్మాయిని కొట్టాడంటూ అభిషేక్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఎస్సై నందిత. 

బాధితుడు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలంటూ పిలిచి బెదిరించడంతో.. వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు అభిషేక్ 30 వేల రూపాయలు లంచంగా ఇస్తుండగా, ఎస్సై నందితను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చేతులకు టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.