వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన కోడెల సంరక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోడెల సంరక్షణ పై అధికారులకు సూచనలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో 40 ఎకరాల్లో ఆధునిక గోశాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల విశ్వాసాన్ని పెంచేలా కోడెల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆలయ అధికారులు సేవా దృక్పథం తో పని చేయాలని సూచించారు. ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వెటర్నరీ అధికారి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
కోరుట్ల, వెలుగు: ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిస్తుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని ఆలయ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బుధవారం ఆలయ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పునర్నిర్మాణం, విస్తరణకు ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామానికి గుడి, బడి, చెరువు, గ్రామ పంచాయతీ వంటి మౌలిక వ్యవస్థలు ఎంత ముఖ్యమో, గ్రామ ఆధ్యాత్మికతకు ఆలయాలు కూడా అంతే ముఖ్యమన్నారు.
