- సర్కారుకు నివేదికలు పంపిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు
- ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలతో ఇసుక దొరక్క ఆగుతున్న పనులు
- కేంద్ర అటవీశాఖ ఆమోదిస్తేనే స్థానిక ప్రజలకు ఊరట
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ‘కవ్వాల్ టైగర్ రిజర్వ్’ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు స్థానిక అభివృద్ధికి గుదిబండగా మారాయి. రక్షిత అడవుల సంరక్షణ కోసం రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల మేర అమలు చేస్తున్న నిబంధనలతో స్థానికంగా ఇసుక, మట్టి దొరక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సీసీ రోడ్ల పనులు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్లతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్కు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలపై ఎఫెక్ట్..
కవ్వాల్ టైగర్ రిజర్వ్ చుట్టూ 10 కిలోమీటర్ల బఫర్ జోన్ ఉండడంతో, ఆ పరిధిలోని స్థానిక వాగులు, వంకలతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక, మట్టి తేవడంపై అటవీ శాఖ కఠిన ఆంక్షలు విధించింది.
నిబంధనల ప్రకారం.. ఈ పరిధిలో ఎలాంటి కమర్షియల్ మైనింగ్, సామిల్లులు, పర్యావరణ కాలుష్యం కలిగించే పనులకు అనుమతి లేదు. అయితే, స్థానిక అవసరాలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామీణ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు పంపించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి తుది ఆమోదం లభిస్తేనే ఈ పరిధి కుదింపు అమల్లోకి వస్తుంది.
అప్పటివరకు ప్రస్తుతం ఉన్న 10 కిలోమీటర్ల నిబంధనలనే అధికారులు అమలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కేంద్రం నుంచి క్లియరెన్స్ తెప్పిస్తేనే.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు
రక్షిత అడవులు, అభయారణ్యాల చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని స్థానిక పరిస్థితులు, భౌగోళిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని 2006లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని అటవీ శాఖ, రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపాయి. ప్రస్తుతం ఉన్న 10 కిలోమీటర్ల నిబంధనను ఒక కిలోమీటర్కు కుదిస్తూ అటవీశాఖ, జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా పీసీసీఎఫ్ ఆఫీస్కు ప్రతిపాదనలు పంపించారు.
స్థానిక ప్రజల కోసమే..
స్థానిక ప్రజల ఇబ్బందులు, అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని కవ్వాల్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లు ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ను కిలోమీటర్కు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఈ ఫైల్ వెళ్లి అక్కడ ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే అధికారులు పని చేయాల్సి ఉంటుంది.
రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్వో, మంచిర్యాల
