సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రోమాంచకం’. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. ఏషియన్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
చిత్ర సమర్పకులు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు ఎంతగా నవ్వుకున్నానో, చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. సూపర్ హిలేరియస్ మూవీ ఇది. రాబోయే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో సహా మా బ్యానర్లో అన్నీ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలే. కానీ ఫస్ట్ టైమ్ దీనికి యు/ఎ వచ్చింది. నేను ఎన్నిసార్లు ఫ్యామిలీతో కలిసి మా సినిమాకు రమ్మన్నా ప్రేక్షకులు రాలేదు.. ఈ సినిమాకు మాత్రం ఫ్యామిలీతో రండి.
ఇన్నోసెంట్గా ఉండే ఇందులోని హీరో క్యారెక్టర్తో మెప్పించడం కష్టం. హీరోహీరోయిన్ల పాత్రలు చూస్తుంటే సినిమాలా కాకుండా పక్కనే ఉండి వాళ్లను చూస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు టైమ్ తెలియదు’ అని చెప్పాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరితో చూసినా ఎంజాయ్ చేసే ఫన్ క్యూట్ ఎంటర్టైనర్ ఇదని హీరో సుమంత్ ప్రభాస్ చెప్పాడు.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠలను ఫీల్ అవ్వాలంటే ఈ చిత్రం చూడమని అనంతిక చెప్పింది. ఈ సినిమాకు వర్క్ చేసిన యంగ్ టీమ్ అందరికీ చక్కని గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టు ప్రణయ్ రెడ్డి వంగా అన్నారు. నటుడు వెంకటేష్ కాకుమాను, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, డీవోపీ పవన్ పప్పుల తదితరులు పాల్గొన్నారు.
