మెట్రో గురించి అసెంబ్లీలో మొదట మాట్లాడింది నేనే: అక్బర్
హైదరాబాద్, వెలుగు: మజ్లిస్ పోరాటం వల్లే హైదరాబాద్కు మెట్రో వచ్చిందని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్లో మెట్రో రైలు నిర్మాణం చేయాలని వైఎస్ హయాంలో అసెంబ్లీలో తానే తొలిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. హైదరాబాద్కు మెట్రో వచ్చినా ఓల్డ్ సిటీకి రాలేదని, ఓల్డ్ సిటీపై ప్రభుత్వం శీత కన్నేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎంఎంటీఎస్ ఫేజ్ –2 కూడా విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ అది కూడా రాలేదన్నారు. బుధవారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్కుమెట్రో రైలు కావాలని తాను అడిగితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే పీజేఆర్ మోనో రైలు కావాలని అడిగేవారని, దీంతో అంతా కన్ఫ్యూజన్కు గురయ్యేవారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఓల్డ్ సిటీ మెట్రో రైల్ అలైన్మెంట్లో 93 ప్రార్థన మందిరాలు ఉండడం వల్ల ఆ అలైన్మెంట్ను మార్చాలని తాము కోరినట్లు చెప్పారు. మెట్రోను తాము వ్యతిరేకించడం లేదన్నారు. మెట్రోను ఓల్డ్ సిటీకి విస్తరించేందుకు ఇన్నాళ్లు మూసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిందని, మరి చాదర్ఘాట్ నుంచి మూసీ నది మీదుగా వెళ్లిన మెట్రో లైన్కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అడిగితే క్లియరెన్స్లు అడ్డు వస్తున్నాయని, మీరు చేస్తే అడ్డు రాదా అని నిలదీశారు.