భూములన్నీ దోపిడీ దారులకు కట్టబెడుతున్నారు

భూములన్నీ దోపిడీ దారులకు కట్టబెడుతున్నారు
  • భూములు కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తాం
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్  

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భూములన్నీ దోపిడీ దారులకు కట్టబెడుతున్నారని, భూములు కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. 1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ రంజిత్ రెడ్డి కి అడ్డగోలుగా ఇచ్చేసారని ఆయన ఆరోపించారు. బుధవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములు అడ్డగోలుగా తీసుకున్నారని విమర్శించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి లకు ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టిందని, 17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని ఆయన ఆరోపించారు. 
భూముల దోపిడీలో కేసీఆర్ కు వాటా ఎంత..? 
తెలంగాణ కు వ్యతిరేకంగా ఉన్నాడని బద్నాం చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భూములను కాపాడారని, కేసీఆర్ తెలంగాణ భూములను దోపిడిదార్లకు అప్పగించారని, ఇందులో కేసీఆర్ కు వాటా ఎంత.. ? చెప్పాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి దేవపాయాన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడుతారా.. ? గతంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి పని చేసారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ వాళ్ళు ఆంజనేయ గుడిని ఎందుకు కాపాడేందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కి లేఖ రాశామన్నారు. సంబంధిత అధికారులకు, హోసింగ్ బోర్డ్ కు కూడా లేఖలు రాశామని, ఈ విషయంలో ఎంత దూరం అయినా పోతాం, తెలంగాణ భూములు కపడుకుంటాం, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా కాపాడుకుంటామని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.