నోట్లపై అంబేద్కర్ ఫొటో అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తం: మల్లు రవి

నోట్లపై అంబేద్కర్ ఫొటో అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తం: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి  మల్లు రవి తెలిపారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్ మంతర్ లో మహా ధర్నా జరిగింది.

దీనికి ఎంపీ ఆర్.కృష్ణయ్య, మల్లు రవి, జేడీ లక్ష్మీనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేదన్నారు. రాజ్యాంగంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు అంబేద్కరే మూల కారణమని వెల్లడించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో అంశాన్ని సీఎం దృష్టికి  తీసుకెళ్లి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాసేందుకు కృషి చేస్తానని చెప్పారు.