న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్జేపీ నడ్డా సహా పలువురు ఆ పార్టీ అగ్రనేతలు సోమవారం అయోధ్య బాల రాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వీక్షించారు. నడ్డా.. ఝండేవాలన్ ఆలయంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, పార్టీ నాయకులతో కలిసి చూడగా.. అమిత్ షా.. బిర్లా టెంపుల్ (లక్ష్మీ నారాయణ ఆలయం)లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి చూశారు. అనంతరం వారు ఆయా ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ఇది 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిన పెద్ద చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇది దేశ ప్రజలందరికీ పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. అలాగే, హర్దీప్ సింగ్ పూరీ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.