తొలిరోజునే పరేషాన్ చేసింది
రిపేర్ చేసిన టెక్నీషియన్
మళ్లీ అదే సమస్య రిపీట్
పట్టించుకోకుండా వదిలేసిన వైద్యాధికారులు
భద్రాచలం ఏరియా దవాఖానాలో రోగుల కష్టాలు
భద్రాచలం, వెలుగు : నాలుగు రాష్ట్రాల సరిహద్దున ఉన్న భద్రాచలం ఏరియా దవాఖానాలో లక్షలు పెట్టి కొన్న అంబులెన్స్ మూలకు పడ్డది. ఇక్కడకు నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వస్తుంటారు. వారిని అత్యవసరంగా హైదరాబాదు, విజయవాడ వంటి మెగాసిటీలకు ట్రీట్మెంట్కోసం తీసుకెళ్లాలంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ డాక్టర్ఎంవీ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్చొరవతో నెల కిందట కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ కింద భద్రాచలం ఏరియా దవాఖానాకు ఎమర్జెన్సీ అంబులెన్స్ కేటాయించారు.
మొదటిరోజే మొరాయించింది
అంబులెన్స్వచ్చిన మొదటి రోజే మొరాయించింది. నెల కిందట ఓ పేషెంట్ను తీసుకువెళ్తుండగా రెండు , మూడు కిలోమీటర్లు వెళ్లి ఆగిపోయింది. తర్వాత ఆ పేషెంట్ను వేరే అంబులెన్స్లో పంపించాల్సి వచ్చింది. తర్వాత ఏరియా దవాఖానాకు తీసుకువచ్చి పడేశారు. ఇక అప్పటినుంచి మళ్లీ ప్రైవేట్ అంబులెన్స్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్ని ఫెసిలిటీస్ ఉండీ ఏం లాభం
ఎమర్జెన్సీ రోగుల కోసం కేటాయించిన ఈ అంబులెన్స్లో వెంటిలేటర్ఫెసిలిటీతో పాటు సెంట్రల్ ఆక్సిజన్సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. పేషెంట్ఉన్న ఆరోగ్య స్థితి మారకుండా తీసుకెళ్లడానికి ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుంది. దీని విలువ దాదాపు రూ.30లక్షల వరకు ఉంటుంది. మొదటిసారి పాడైపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన టెక్నీషియన్ రిపేర్ చేసి అంతా ఓకే అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత స్టార్ట్ చేస్తే మళ్లీ అదే సమస్య రిపీటైంది. టెక్నీషియన్కు ఫోన్ చేయగా ఎలక్ట్రికల్ సిస్టం పాడైపోయిందని, హైదరాబాదుకు తీసుకురావాలని సూచించాడు. దీంతో ఎవరూ పట్టించుకోకుండా అలాగే మూలకు పడేశారు.
ఎలక్ట్రికల్ సిస్టమ్ దెబ్బతింది
ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్దెబ్బతిన్నది. అందుకే పక్కకు పెట్టాం. కొత్త వెహికల్ కావడంతో సంబంధిత కంపెనీకి సమాచారం అందించాం. వారు వచ్చి రిపేర్చేస్తారు. ఆ తర్వాత ఉపయోగిస్తాం. -డా.యుగంధర్, సూపరింటెండెంట్, ఏరియా దవాఖాన, భద్రాచలం.
రిపేర్ చేయించాలి
పేదలకు ఉపయోగపడే ఎమర్జెన్సీ అంబులెన్స్ విషయంలో ఏరియా దవాఖానా సూపరింటెండెంట్నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని వెంటనే రిపేర్ చేయించాలి. చిన్న చిన్న సమస్యలకు అంబులెన్స్ ను పక్కన బెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో కలెక్టర్ దృష్టి పెట్టి బాగు చేయించి రోగులకు అందుబాటులోకి తేవాలి. -ఆకోజు సునీల్, సీపీఐ పట్టణ కార్యదర్శి