
- కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్పీకర్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం
- నాలుగైదు లక్షల మంది వస్తారని
- బత్తిని బ్రదర్స్ అంచనా
- మొత్తం 42 క్యూలైన్ల ఏర్పాటు
- ఇప్పటికే వేల మంది తరలివచ్చిన ఆస్తమా బాధితులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆది, సోమవారం బత్తిన కుటుంబ సభ్యులు చేపప్రసాదం పంపిణీకి చేయనున్నారు. ఆస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిరకార్తె రోజు చేపమందు పంపిణీ చేస్తున్నారు. చేపప్రసాదం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9.30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి చేపప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం నాలుగైదు లక్షల మంది వరకు వస్తారని బత్తిని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం దాదాపు 10 వేల మంది వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 కౌంటర్లలో చేపపిల్లలకి సంబంధించిన టోకెన్ ఇవ్వనుండగా, శుక్రవారం 9 కౌంటర్లలో జారీ చేశారు. ఒక్కో చేపపిల్లకి రూ.40 కలెక్ట్ చేశారు. షిఫరీస్ డిపార్టుమెంట్ అధికారులు మొత్తం లక్ష చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. వాలంటీర్లు 400 మంది ఉండగా, 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చేపప్రసాదం కోసం వచ్చేవారిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఆదివారం 60 బస్సులు , సోమవారం 80 బస్సులను ప్రత్యేకంగా నడపనుంది.
టోకెన్ల జారీ ఆలస్యం కావడంతో
చేపప్రసాదం కోసం ఒకరోజు ముందుగానే వేలాది మంది తరలిరావడంతో చేపప్రసాదం కోసం అందించే చేపపిల్ల టోకెన్లను ముందుగా ఇచ్చారు. అయితే, టోకెన్ల పంపిణీ ఆలస్యం కావడంతో క్యూలైన్ లో పబ్లిక్ అసహనం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచిచూసి ఓపిక నశించిన జనం.. టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నాంపల్లిలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. శనివారం వచ్చిన వారి కోసం పలు సేవాసమితిల ఆధ్వర్యంలో భోజనం అందించారు.
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
చేపపిల్లల పంపిణీలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెల్త్, రెవెన్యూ, మత్స్యశాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. చేపప్రసాదం పంపిణీకి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సమీక్షా నిర్వహించారు. అంచనాకి మించి జనం వస్తే ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు.
ఎంతమంది వచ్చినా సిద్ధంగా ఉన్నం: బత్తిని శివశంకర్ గౌడ్
1845 నుంచి మా కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నది. 1998 వరకు చేపమందు కోసం మా ఇంటికి ఏటా 2 లక్షల మంది వచ్చేవారు. అప్పటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈసారి నాలుగైదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నం. ఎంతమంది వచ్చినా చేపప్రసాదం వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.