తెలంగాణవన్నీ కొత్త ప్రాజెక్టులేనట!

తెలంగాణవన్నీ కొత్త ప్రాజెక్టులేనట!
  • కల్వకుర్తి, నెట్టెంపాడు తప్ప దేనినీ ఒప్పుకోరట..
  • ఎస్​ఎల్​బీసీని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించలేదట.. 
  • దానిని షెడ్యూల్​ 11లో పెట్టనందున దానికి మళ్లీ అనుమతులు తీసుకోవాలట..
  • కృష్ణా ట్రిబ్యునల్​లో ఏపీ అడ్డమైన వాదనలు
  • తెలంగాణకు 299 టీఎంసీలకు మించి ఒక్క చుక్క ఇచ్చేది లేదన్న పొరుగురాష్ట్రం

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా ట్రిబ్యునల్​ వేదికగా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మరోసారి విషం కక్కింది. కృష్ణా బేసిన్​లో ఉన్న నీళ్లన్నీ తమవే అన్నట్టుగా.. తెలంగాణకు ఏమీ లేవన్నట్టుగా వాదనలు వినిపించింది. షెడ్యూల్​ 11లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు తప్ప తెలంగాణ చేపట్టిన అన్ని ప్రాజెక్టులూ కొత్తవేనని అడ్డమైన వాదనలకు దిగింది. ఎప్పుడో ఉమ్మడి ఏపీలోనే తలపెట్టిన ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టు కూడా కొత్తదేనని వాదించింది.

పాలమూరు రంగారెడ్డి సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చి చెప్పింది. బుధవారం కృష్ణా ట్రిబ్యునల్​లో ఏపీ తన తుదిదశ వాదనలను కొనసాగించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్​ స్కీమ్​లకు మాత్రమే ఒప్పుకుంటామని చెప్పిన ఏపీ.. దానికీ మెలిక పెట్టింది. ఆ రెండు ప్రాజెక్టులు కూడా సర్​ప్లస్​ వాటర్​ ఆధారంగా 65 శాతం డిపెండబిలిటీతో కట్టినవని, 75 శాతం డిపెండబిలిటీ కింద వాటిని ఒప్పుకునేది లేదని పేర్కొంది.

ఆయా ప్రాజెక్టులను 25 టీఎంసీలు, 22 టీఎంసీల నీటి వాటాలకే ఒప్పుకుంటామని తెలిపింది. షెడ్యూల్​ 11లో కొత్త ప్రాజెక్టులను చేర్చి కడ్తామంటే ఊరుకునేది లేదని వాదనలకు దిగింది. ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టును వాస్తవానికి 1986లోనే ఎస్​ఆర్​బీసీ కట్టేటప్పుడే ప్రతిపాదించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఏపీ మాట మార్చింది. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఆ ప్రాజెక్టును ప్రతిపాదించలేదని, అది కూడా కొత్త ప్రాజెక్టేనని ట్రిబ్యునల్​ ముందు వాదించింది.

ఆ ప్రాజెక్టు కూడా షెడ్యూల్​ 11లో లేదని, దానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. కృష్ణా బేసిన్​లో తెలంగాణకున్నది కేవలం 299 టీఎంసీల జలాలేనని, అంతకుమించి ఒక్క చుక్క కూడా ఇచ్చేది లేదని ట్రిబ్యునల్​కు తెలిపింది. జూరాల ప్రాజెక్టుకూ 9 టీఎంసీల నీటి లభ్యతను 65 శాతం డిపెండబిలిటీ కిందే ఇచ్చారని పేర్కొంది.

ఆ ప్రాజెక్ట్​ ఆధారంగా నిర్మిస్తున్న నారాయణపేట కొడంగల్​ లిఫ్ట్​.. దానిని ఓవర్​ల్యాప్​ చేస్తూ నిర్మిస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అంగీకరించబోమని తెలిపింది. బచావత్​ ట్రిబ్యునల్​ ఎప్పుడో ప్రాజెక్టులవారీ కేటాయింపులను చేసిందని, మళ్లీ ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ అంటూ నీటి వాటాల పంపిణీకి ఒప్పుకునేది లేదని పేర్కొంది. అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో కొత్త ప్రాజెక్టులకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారని, ఆ లెక్కన తెలంగాణలో ఉన్నవన్నీ కొత్త ప్రాజెక్టులేనని వాదించింది.