కేసీఆర్..అది సచివాలయమా ? వజ్రవైఢూర్యాలున్న మ్యూజియమా?:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్..అది సచివాలయమా ? వజ్రవైఢూర్యాలున్న మ్యూజియమా?:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మీరు కడుతున్నది సచివాలయమా లేక వజ్రవైఢూర్యాలున్న మ్యూజియమా? అని బహుజన సమాజ్ వాదీ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 300 మంది పోలీసుల జీతం దాదాపుగా ఏడాదికి ₹18 కోట్లన్న ఆయన.. అదంతా ఎవరి డబ్బు? అని నిలదీశారు. ఇంత చేసి మీరు రోజూ ఆఫీసుకు వస్తారని గ్యారంటీ ఉందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రగతి భవన్ కు వస్తేనే కలుస్తలేరు, ఇంక నూతన సచివాలయానికొస్తే మీ పోలీసులు మిమ్మల్ని కలవనిస్తరా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త సెక్రటేరియెట్​కు రాష్ట్ర సర్కార్​ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ప్రతి ఫ్లోర్​లో పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దాదాపు 300ల మంది పోలీస్​ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెటాలియన్ పోలీస్​ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించనున్నది.  ఈ మేరకు ఇంటెలిజెన్స్​ డిపార్ట్​మెంట్​నుంచి డీజీపీ ఆఫీస్​కు గత నెల 12వ తేదీన సమాచారం అందింది. ఈ నెల 18న సెక్రటేరియెట్​ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓపెనింగ్​ తర్వాత అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉండడంతో డీజీపీ ఆఫీస్​ నుంచి టీఎస్​ఎస్​పీ బెటాలియన్​ ఏడీజీకి లెటర్​ వెళ్లింది. ఒకటి, మూడు, 8 బెటాలియన్ల నుంచి ఆరుగురు ఆర్​ఐలు, 14 మంది ఆర్​ఎస్​ఐలు, 50 మంది ఏఆర్​ఎస్​ఐ/హెడ్​కానిస్టేబుల్​, పీసీలు 217 మంది, ఎల్​జీఎస్​ 10 మందిని  కేటాయిస్తూ బెటాలియన్ కమాండెంట్స్​కు సమాచారం వెళ్లింది. 

బెటాలియన్​కు సెక్యూరిటీ బాధ్యతలు

దాదాపు 25 ఏండ్లుగా సెక్రటేరియెట్​కు తెలంగాణ స్టేట్​స్పెషల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​పోలీసులు భద్రతనిస్తున్నారు. ఇప్పుడు కూడా  వారి ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ కొనసాగుతోంది.  ప్రస్తుతం దాదాపు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్​పీఎఫ్​ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే, ఎస్​పీఎఫ్​ను కాదని బెటాలియన్​కు కొత్త సెక్రటేరియెట్​లో భద్రత బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్​ లేకుండానే నేరుగా డీజీపీ ఆఫీస్​ నుంచి బెటాలియన్​కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంట్లోనూ ఏదో మిస్​ కమ్యూనికేషన్​ జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు.