ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ( ఏప్రిల్ 7 ) మల్లికార్జున స్వామివారి లింగరూపానికి అన్నాభిషేకం నిర్వహించి పెరుగన్నం, భక్షాలతో కప్పేశారు అర్చకులు. అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసేశారు అధికారులు.
కుంభోత్సవంలో కీలక ఘట్టమైన స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతినిచ్చారు స్వామివారి ఆలయ ఉద్యోగి గోవింద్. రెండోవ విడత సాత్వికబలిగా గుమ్మడి,టెంకాయ,అన్నం రాసి అమ్మవారికి సమర్పించారు. కుంభోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు సహా స్థానికులు,భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
