లండన్: క్రికెట్కు చిరునామాగా పేరొందిన లార్డ్స్ మైదానం శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ఇంగ్లండ్, భారత్ మహిళల జట్లు తొలిసారిగా శుక్రవారం ఈ వేదికపై టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. 1976లో రాచెల్ హేహో-ఫ్లింట్ నాయకత్వంలో ఇంగ్లండ్ మహిళల జట్టు లార్డ్స్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా.. 50 ఏళ్ల తర్వాత మహిళల టెస్టుకు ఈ మైదానం ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఇప్పటి వరకు లార్డ్స్లో ఒక్క మహిళల టెస్టు కూడా జరగలేదు.
కొత్త ప్లేయర్ల ఎంట్రీ..
ఈ టెస్టుతో భారత తరఫున హర్లీన్ డియోల్, శ్రీచరణి అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్నారు. ఇంగ్లండ్ నుంచి కూడా ఐదుగురు తొలిసారి టెస్టు క్యాప్ అందుకోనున్నారు. ఈ మ్యాచ్లో భారత్ నుంచి స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మరోసారి ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయపడిన ప్రతీకా రావల్ స్థానంలో ప్రియా పునియాను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు అనుభవజ్ఞ ఓపెనర్ ట్యామీ బీమాంట్ ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు. మహిళల టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఇంగ్లిష్ క్రికెటర్గా నిలిచిన బీమాంట్, లార్డ్స్లో చివరి మ్యాచ్ ఆడడం ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ మాట్లాడుతూ.. లార్డ్స్లో టెస్టు ఆడటం చిన్నప్పటి కల అని, మహిళల క్రికెట్కు ఇది మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ మ్యాచ్కు ఇప్పటికే 30 వేలకుపైగా టికెట్లు విక్రయమయ్యాయి. ప్రారంభ వేడుకల్లో గత, ప్రస్తుత ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు 50 మంది పాల్గొననున్నారు. లార్డ్స్లో జరిగే ఈ చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంగ్లండ్పై టెస్టు క్రికెట్లో భారత్కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్తో చివరి నాలుగు టెస్టుల్లో భారత్ మూడు విజయాలు సాధించగా, ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. అక్కడ రెండు విజయాలు, ఏడు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
హెడ్ కోచ్ అమోల్ మజుందార్
ఇంతటి ప్రతిష్ఠాత్మక వేదికపై ఇప్పటివరకు మహిళల టెస్టు నిర్వహించకపోవడం అర్థం కావడం లేదని భారత మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్లో తామూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆటగాళ్లకు కూడా ఇది జీవితకాలంలో మరపురాని
అనుభవమని పేర్కొన్నారు.
గెలిస్తే చరిత్రలో నిలుస్తాం : హర్మన్ ప్రీత్
ఈ చరిత్రాత్మక మహిళల టెస్టు భారత జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా గుర్తింపు పొందిన లార్డ్స్లో విజయం సాధిస్తే అది భారత మహిళల క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయంగా నిలుస్తుందన్నారు. ఈ మ్యాచ్లో గెలుపు సాధించ డం ద్వారా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం తమ ముందుందని ఆమె అన్నారు. లార్డ్స్లో తొలి పురుషుల టెస్టు జరిగిన 142 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళల టెస్టు నిర్వహిస్తుండటం ఈ మ్యాచ్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. దీంతో ఈ చారిత్రక పోరుపై ప్రపంచ క్రికెట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
