న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ రూ.1.34 లక్షల ధరతో శాటిలైట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రక్షణ రంగ సిబ్బంది, సముద్రంలో ప్రయాణించే వాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ధరను రూ.1,34,166 గా కంపెనీ నిర్ణయించింది.
సాధారణ మొబైల్ సిగ్నల్స్ అందని అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ , ఎస్ఎంఎస్ సేవలను పొందవచ్చు.
గనుల తవ్వకాలు, రిమోట్ ఆపరేషన్స్ , అడ్వెంచర్ ట్రావెలర్స్కు ఎంతో ఉపయోగపడుతుంది. శాటిలైట్ పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలు నెలకు రూ.3,500 నుంచి రూ.11,670 వరకు ఉన్నాయి. ప్రీపెయిడ్ ప్లాన్ల వార్షిక చార్జీలు రూ.38,500 నుంచి ప్రారంభమవుతాయి.
