Farm house case : ప్రభుత్వ అప్పీల్పై విచారణ సోమవారానికి వాయిదా

Farm house case : ప్రభుత్వ అప్పీల్పై విచారణ సోమవారానికి వాయిదా

ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై విచారణను హైకోర్టులో సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరఫున అడ్వొకేట్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర  ప్రభుత్వాన్ని కూల్చలేదని,  ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని ధర్మాసనానికి విన్నవించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరాలని బహిరంగ ప్రకటన చేసింది సీఎం కేసీఆర్ అని దామెదర్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. 

దామోదర్ రెడ్డి వాదనలపై స్పందించిన న్యాయమూర్తి ఫాం హౌస్ కేసులో అసలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ డిస్మిస్ చేసిందని, అలాంటప్పుడు బీజేపీ తరఫున మీరు ఎందుకు వాదనలు వినిపిస్తున్నారని అడిగారు. తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సిట్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు ఉన్నందునే తాము కల్పించుకోవాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి చెప్పారు. సిట్ వాదనలకు సమాధానం చెప్పేందుకే రాజకీయాలను ప్రస్తావించానని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.