మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై  జైలు శిక్ష అనుభవిస్తున్న సెంథిల్‌ బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల మద్రాస్‌ హైకోర్టులో బాలాజీ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు​ చర్చనీయాంశంగా మారింది.  

కాగా 2023 జూన్  14న బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆయన నివాసంతో పాటుగా కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ జరిపి ఆ తరువాత అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.  గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసు నమోదు చేశారు.

సెంథిల్‌ బాలాజీ జైల్లో ఉన్నప్పటికీ సీఎం స్టాలిన్ మాత్రం  బాలాజీని  తన మంత్రి వర్గంలోనే కొనసాగించారు. కానీ ఎలాంటి పోర్ట్‌ఫోలియోను  కేటాయిం‍చలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు సూచించింది.  

కాగా  బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి  దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.