న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల సామాజిక వ్యాప్తి కూడా మొదలైందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కేసులు పెరుగుతున్నందున జమ్మూ కాశ్మీర్లోని రెడ్ జోన్స్లో లాక్డౌన్ విధించారు. బందిపొరా ప్రాంతం తప్ప కాశ్మీర్ జోన్లోని రెడ్ జోన్స్లో ఈ నెల 27 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అయితే ఈ పీరియడ్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కొనసాగుతాయని జమ్మూ కాశ్మీర్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఇప్పటికే జమ్మూ జిల్లా కమిషనర్ సుష్మా చౌహాన్ ఈ నెల 24 వరకు పాక్షిక లాక్డౌన్ విధించారు. బుధవారం లోయలో 502 తాజా కేసులు నమోదయ్యాయి. మంగళవారం జమ్మూ కాశ్మీర్లో 608 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 15,258 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.