ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్8న ఉచిత చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు, దివంగత బత్తిని హరినాథ్కొడుకు అమర్నాథ్ గౌడ్ తెలిపారు. వచ్చే నెల 8న శనివారం ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుందని.. అదే రోజు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించి.. మరుసటి రోజు ఆదివారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలపాటు పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి 3 లక్షల చేప పిల్లలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. వెజిటేరియన్లకు బెల్లంతో ప్రసాదం ఇస్తామని చెప్పారు.
సుమారు 179 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని, ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాంపల్లిలో ప్రసాదం పంపిణీ పూర్తయిన అనంతరం దూద్ బౌలిలో మూడు రోజులపాటు పంపిణీ ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్స్తోపాటు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు శతాబ్దాలుగా బత్తిని కుటుంబం చేపప్రసాదం పంపిణీ చేస్తోందని తెలిపారు.
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాశ సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తె ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్థాన్ని చేప ద్వారా నోటిలో వేస్తామని ఆయన పేర్కొన్నారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాయని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. త్వరలోనే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డితో పాటు, వారి మంత్రివర్గ సభ్యులను కలిసి చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుతామని ఆయన తెలిపారు.
ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లతో పాటు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తామన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి భోజనం, టీ, కాఫీ, మజ్టిగ, మంచినీళ్లను స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తాయని ఆయన చెప్పారు. సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు గౌరీశంకర్ గౌడ్, శివశంకర్ గౌడ్, సంతోష్ గౌడ్, కైలాశ్ కేడియా తదితరులు పాల్గొన్నారు.
