ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ఐఐటీ విద్యార్థి అరెస్ట్

ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ఐఐటీ విద్యార్థి అరెస్ట్

గౌహతి:  ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ఐఐటీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్‌ఐఎస్‌ వైపు మొగ్గు చూపుతూ ఉగ్ర గ్రూపులో చేరేందుకు వెళుతున్న ఐఐటీ-గౌహతి విద్యార్థిని శనివారం సాయంత్రం అస్సాంలోని హజోలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాల్గొవ సంవత్సరం బయోటెక్నాలజీ చదువుతున్న ఐఐటీ గౌహతి విద్యార్థి.. ఐఎస్‌ఐఎస్‌ చేరేందుకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. సదరు విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై విచారణ జరుగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జీపీ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఐఐటీ-గౌహతి విద్యార్థి..  ఐఎస్ఎస్ లో చేరబోతున్నట్లు ఓ వ్యక్తి నుంచి తమకు ఇమెయిల్‌ ద్వారా సమాచారం అందించారని పోలీసు సూపరింటెండెంట్ కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. దీంతో ఐఐటీ-గౌహతి అధికారులను సంప్రదించామని ఆయన తెలిపారు.అయితే, ఆ విద్యార్థి మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ గా ఉందని తెలిపారు.  ఈ క్రమంలో  విద్యార్థి కోసం పోలీసులు పలు గ్రూపులుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి.. గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలోని హజో  ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సదరు విద్యార్థి ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. తర్వాత విద్యార్థి హాస్టల్ గదిలో సెర్చ్ చేయగా.. ఐఎస్ఐఎస్ మాదిరిగానే నల్ల జెండా కనిపించిందని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, బంగ్లాదేశ్ నుండి ధుబ్రి జిల్లాలో ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్ హరీస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లను అరెస్టు చేసిన నాలుగు రోజుల తర్వాత విద్యార్థిని పట్టుబడ్డాడు.