మహబూబాబాద్ లో ఓటర్లపై తేనెటీగల దాడి

మహబూబాబాద్ లో ఓటర్లపై తేనెటీగల దాడి

గూడూరు, వెలుగు: ఓటు హక్కును వినియోగించడానికి వెళ్లిన గిరిజనులపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నెల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో లైన్ తాండాకు చెందిన ఆజ్మీర స్వామికి తీవ్రంగా,మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.గురువారం ఉదయం చిన్నెల్లపురం శివారు మూడు గుడిసెల తండాకు చెందిన గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే స్కూల్ లో ఏర్పాటు చేసిన 15వబూత్ లైన్లో నిలబడ్డారు. పోలింగ్ బూత్ పక్కన ఉన్నచేలో ఎండిన పంటకు ఆ పొలం రైతు నిప్పంటించాడు. స్కూల్ ఆవరణలో చెట్టుపై ఉన్న తేనెతట్టెకు పొగ, వేడి తగలడంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు ఓటర్లనుకుట్టాయి. కొంతమంది పరుగులు పెట్టగా వృద్ధుడైన ఆజ్మీర స్వామి కదలలేకపోయాడు.అతడిని తీవ్రంగా కుట్టడంతో స్పృహ తప్పిపడిపోయాడు. స్వామిని వెంటనే నర్సం పేట దవాఖానాకు తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఎవరూ ఓటింగ్ కేంద్రానికి రాలేదు.అంతా సర్దుకున్నాక మళ్లీ ఓటింగ్ ను అధికారులు ప్రారంభించారు.