మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్లో ఆస్ట్రేలియా ఇరగదీసింది. నాలుగు రోజుల్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసింది. నేథన్ లైయన్(4/81), ప్యాటిన్సన్ (3/35) చెలరేగడంతో న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన సెకండ్ టెస్ట్లో 247 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 488 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో కివీస్ 240కే ఆలౌటైంది. గాయపడిన పేసర్ ట్రెంట్ బౌల్ట్ బ్యాటింగ్కు రాకపోవడంతో ఆ జట్టు పది మందితోనే ఆడింది. ఓపెనర్ బ్లండెల్(121) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ప్యాటిన్సన్ దెబ్బకు లాథమ్(8), కేన్ విలియమ్సన్(0), రాస్ టేలర్(2) వికెట్లు కోల్పోయిన కివీస్ 12 ఓవర్లు ముగిసేసరికి 35/3పై నిలిచింది. దీంతో ఆసీస్ విజయం ఖాయమవగా మొండిగా పోరాడిన బ్లండెల్ దానిని కాస్త ఆలస్యం చేశాడు. అయితే నికోల్స్(33), వాట్లింగ్(22), శాంట్నర్(27), గ్రాండ్హోమ్(9) వికెట్లు తీసిన లైయన్ మిగిలిన పని పూర్తి చేశాడు. నికోల్స్తో 54, వాట్లింగ్తో 72, శాంట్నర్తో 40 రన్స్ జోడించిన బ్లండెల్ కెరీర్లో రెండో టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లబుషేన్ బౌలింగ్లో లైయన్కు క్యాచ్ ఇచ్చి లాస్ట్ వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 137/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 31 రన్స్ జోడించి 168/5 వద్ద సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సిరీస్లో మూడో టెస్ట్ శుక్రవారం నుంచి సిడ్నీలో జరుగుతుంది.

