అయోధ్యలో అపూర్వ ఘట్టం అవిష్కృతమైంది. బాలరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బాలరాముడి దివ్యమనోహర రూపం చూపుతిప్పుకోని విధంగా ఉంది. స్వర్ణాభరణాలు, ఎడమచేతిలో విల్లు, కుడిచేతిల బాణంతో బాలరాముడి దర్శనంతో భక్త జనం పులకించింది. రేపటి (జనవరి 23)నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు.
దర్శనం ఎలా...
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది.
ఆఫ్లైన్లో..
ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను వెంట తీసుకువెళ్లాలి.
దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
టైమింగ్స్ ఇవే
- ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 11:30 వరకు
- మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు
- ప్రత్యేక సందర్భాలలో.. పండుగల సమయాలలో దర్శన వేళల్లో మార్పులుంటాయి
మూడుసార్లు మంగళ హారతి
ఉదయం 6 : 30 గంటలకు శృంగార్ హారతి
మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి
సాయంత్రం 07:30 గంటకు సంధ్యా హారతి
పాటించాల్సిన నియమ నిబంధనలు
- రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది
- ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి
- పురుషులు ధోతీ, కుర్తా-పైజామాను ధరించాల్సి ఉంటుంది.
- మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్,చుడీదార్ సూట్, దుపట్టాతో కూడిన పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులను అస్సలు అనుమతించరు.
- భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడం నిషేధం
- పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్తో కూడిన కీ- చైన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లకూడదు
- గొడుగులు, బ్లాంకెట్లు, గురు పాదుకలను తీసుకెళ్లడంపైనా నిషేధం ఉంది
ఎలా చేరుకోవాలి
ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మధ్యే ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇక మిగిలినవి రైలు, రోడ్డు మార్గాలు.. అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ ను ఇటీవల మోదీ ప్రారంభించారు. ఇక జాతీయ రహదారుల మార్గం గుండా ఆయోధ్యకు చేరుకోవచ్చు.