
లాక్ డౌన్ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేదలకు భోజనం, అల్పాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వందల సంఖ్యలో టీటీడీ సిబ్బంది వంటలు చేస్తున్నారు. తర్వాత పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మరో మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ. కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడి కోసం ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు తీసుకున్న టీటీడీ ఆయుర్వేద మందుల తయారీతో మరో అడుగు ముందుకు వేసింది. జేఈఓ శ్రీ బసంత్ కుమార్ ఆదేశం మేరకు ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, ఎస్ వీ ఆయుర్వేద హాస్పిటల్, ఆయుర్వేద ఫార్మసీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ శ్రీ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు. ఈ మందులు వాడాల్సిన విధానం, వీటివల్ల కరోనా వ్యాధి బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు అనే వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ క్రమంలో పేద ప్రజలకు అన్నప్రసాదం తయారీ కోసం పని చేస్తున్న వంటశాల ( క్యాంటీన్) ల సిబ్బందికి మొదటగా వీటిని అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ తరువాత విడతల వారీగా టీటీడీ లోని అన్ని విభాగాల సిబ్బందికి ఈ మందులను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.