విమానంలో పాప పుట్టిన ఘటన ఇండిగో విమానంలో జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానం బుధవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు-జైపూర్ మార్గంలో విమానం గాల్లో ఎగురుతుండగా ఒక మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న ఓ వైద్యుడి సాయంతో ఆమెకు ప్రసవం అయ్యేలా చూడటంతో.. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే విమాన సిబ్బంది.. జైపూర్ విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో విమానాశ్రయ సిబ్బంది విమానం ల్యాండింగ్ కావడానికి ముందే వైద్య సిబ్బందిని, అంబులెన్స్ను సిద్ధం చేశారు. విమానం ఎయిర్పోర్టుకు చేరుకోగానే ప్రసవించిన మహిళను, బిడ్డను అంబులెన్స్లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలావుంటే ఆపదలో మహిళ సుఖ ప్రసవానికి సాయపడ్డ డాక్టర్ సుబాహన నజీర్ను ఇండిగో సంస్థ అభినందించింది.