
బహ్రైచ్(యూపీ): ఐఫోన్ కోసం ఇద్దరు మైనర్లు ఓ యువకుడిని దారుణంగా చంపేశారు. ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా నాగౌర్ గ్రామంలో ఈ నెల 20న చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన షాదాబ్(19) తన ఫ్యామిలీతో కలిసి ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాగౌర్ గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన 14, 16 ఏండ్ల వయసున్న ఇద్దరు మైనర్ల కళ్లు.. షాదాబ్ దగ్గరున్న ఐఫోన్పై పడ్డాయి. ఆ ఫోన్తో రీల్స్ చేస్తే హై క్వాలిటీతో వస్తాయని వారిద్దరు భావించారు.
దీంతో ఎలాగైనా ఆ ఫోన్ను కొట్టేయాలని అనుకున్నారు. అందుకోసం నాలుగు రోజుల ముందు నుంచే షాదాబ్ను చంపేందుకు ప్లాన్ చేశారు. జూన్ 20న రాత్రి షాదాబ్ రీల్స్ చేయడానికి గ్రామం బయటకు వెళ్లాడు. ఇదే మంచి సమయమని భావించిన నిందితులు.. వెనుక నుంచి వెళ్లి షాదాబ్పై దాడి చేశారు. కత్తితో గొంతు కోసి ఇటుకతో తలపై దారుణంగా కొట్టి చంపారు. డెడ్బాడీని అక్కడే ఉన్న నీటి కుంటలో పడేసి, ఐఫోన్ తీసుకొని పారిపోయారు.
షాదాబ్ కనిపించడం లేదంటూ జూన్ 21న అతని బంధువులు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాదాబ్ డెడ్బాడీని గ్రామ శివారులోని నీటి కుంటలో గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు.. వారి తల్లిదండ్రులతో సహా గ్రామం నుంచి పరారయ్యారు. తర్వాత పోలీసులు నిందితులతో పాటు వారి కుటుంబసభ్యులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి ప్రశ్నించగా, హైక్వాలిటీ రీల్స్ చేసేందుకు ఐఫోన్ కోసం హత్య చేసినట్లు నేరం అంగీకరించారు.