- మే 16 రాత్రి 9 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్కు తరలింపు
- వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ జడ్జి నివాసంలో ప్రవేశపెట్టిన పోలీసులు
- 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి
- చట్టంపై ఉన్న గౌరవంతోనే పోలీసులకు అప్పగించా: బండి సంజయ్
- పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి
- ఉదయం జూబ్లీహిల్స్లోని భగీరథ్ ఇంట్లో గంటపాటు పోలీసుల సోదాలు
హైదరాబాద్,వెలుగు: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ శనివారం నాటకీయ పరిణామాల నడుమ పోలీసులకు లొంగిపోయాడు. మే 16 రాత్రి 8 గంటల సమయంలో నార్సింగి సమీపంలోని పోలీస్ అకాడమీ జంక్షన్ వద్దకు ఇద్దరు లాయర్లతో కలిసి వచ్చాడు. అక్కడి నుంచే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్వోటీ డీసీపీ శోభన్ సహా ఐదుగురు సభ్యుల బృందంతో కూడిన పోలీసులు భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 9.10 గంటల సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. భగీరథ్తో పాటు లాయర్లు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చారు.
భగీరథ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన తర్వాత భగీరథ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. మరో వైపు మేడ్చల్ జిల్లా జడ్జి సమక్షంలో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేసిన రెండు స్టేట్మెంట్లతో పాటు మెడికల్ రిపోర్టులను కలిపి కోర్టుకు సీల్డ్ కవర్లో అందించనున్నారు.
- భగీరథ్ లొంగుబాటులో హైడ్రామా
భగీరథ్ సరెండర్ వ్యవహారంలో హైడ్రామా చోటుచే సుకుంది. జూబ్లీహిల్స్లోని భగీరథ్ ఇంటితో పాటు బంజారాహిల్స్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉద యం నుంచే పోలీసులు సోదాలు నిర్వహించారు. భగీ రథ్ నివాసంలో గంటసేపు తనిఖీలు చేసి, అతని గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో భగీరథ్ను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్తో పాటు మేడ్చల్ జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, భగీరథ్ను తామే పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కానీ, పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి ప్రకటించారు.
- నా కొడుకును పోలీసు విచారణ కోసం అప్పగించా: బండి సంజయ్
మా అబ్బాయి బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. చట్టం ముందు నా బిడ్డయినా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బా యి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్లో అప్పగిద్దామనుకున్నాను. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం.
వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఇప్పటికి కూడా లాయర్లు బెయిల్ వస్తుందనే చెబుతున్నారు. అయితే, ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను.
