సోమేశ్ కుమార్ సీఎస్‭ పదవి రాజీనామా చేయ్: బండి సంజయ్

సోమేశ్ కుమార్ సీఎస్‭ పదవి రాజీనామా చేయ్: బండి సంజయ్

తెలంగాణ సీఎస్‫గా సోమేశ్ కుమార్ ఏపీ కేడర్‭కు వెళ్లాలంటూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పాటించాలని చెప్పారు. సోమేశ్‭ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఏపీకి బదిలీ చేయాలని ఆయన కోరారు. 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి.. ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికమని బండి ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అధికారులను పావుగా వాడుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను ఆయన గౌరవించలేదని ఆరోపించారు. తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా.. ఏపీకి కేటాయించబడ్డ సోమేశ్ కుమార్‭ను చీఫ్ సెక్రటరీగా నియమించి కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ ద్వారా విడుదల చేయించారని చెప్పారు. హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ ‭ను పావుగా వాడుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేశ్ కుమార్ కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా  హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్‭గా నియమించాలన్నారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి  బదలాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.