వేత‌నాల‌పై పున‌రాలోచించాలి: కేసీఆర్ కు బండి సంజ‌య్ లెట‌ర్

వేత‌నాల‌పై పున‌రాలోచించాలి: కేసీఆర్ కు బండి సంజ‌య్ లెట‌ర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ….. ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా త‌న సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని లెట‌ర్ ద్వారా చెప్పారు బండి సంజ‌య్. “దేశవ్యాప్తంగా కరోనా రూపంలో విపత్కర పరిస్థితుల దృష్ట్యా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ …. పేద, సామాన్య ప్రజల లబ్ది కోసం సుమారు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజీని అందుబాటులోకి తెచ్చిన విషయం మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్/ఆఫ్ లైన్ విధానం ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ వద్ద నమోదైనా 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన , 2300 కోట్ల రూపాయల సెస్(CESS) నిధులను ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ, కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

దీనికి అనుగుణంగా, వెంటనే రాష్ట్రం లోని భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (DBT) ద్వారా నేరుగా డబ్బు పంపించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోపట భరోసా కల్పించాల్సిన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాద్యాయుల మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలలో 50% తగ్గించటంలో పునరాలోచించాలని కోరుతున్నాను.

ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే, ఇటువంటి నిర్ణయం తీసుకోవటం,కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాల విషయంలో, ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుంది.

స్వయంగా ప్రధాన మంత్రి, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారు. కానీ, మీరు తీసుకున్న నిర్ణయం ను అలుసుగా తీసుకొని, ప్రైవేట్ క్ట‌కంపెనీలు, వ్యాపారస్తులు, వారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల, కార్మికుల జీతాల్లో కోతలు విధించే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఆరోగ్యశాఖ‌, డాక్ట‌ర్లు నర్సులు, నాలుగవ తరగ తి సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది కి పూర్తి వేతనాలు చెల్లించటంతో పాటు, వారికి వ్యక్తిగత రక్షణ సామగ్రి( మాస్కులు, PPE) వెంటనే సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను”. అని లెటర్ లో తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.