పాదయాత్రను అడ్డుకునేందుకే కుట్ర: బండి సంజయ్ 

పాదయాత్రను అడ్డుకునేందుకే కుట్ర: బండి సంజయ్ 

నిర్మల్ జిల్లా భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రశ్నించారు. భైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అని ప్రశ్నించారు. అసలు భైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భైంసా అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? అమయాకుల ఉసురు తీసిందెవరు? పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. 

తాను భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించామని..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుండి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తోందని... మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోందన్నారు. కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటామని.. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి భరోసా కల్పిస్తామన్నారు. 

 యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నాం కానీ..పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. నిన్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. మొదటి సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి... ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్రను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా  కొనసాగించామని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించిందన్నారు. అందుకే హైకోర్టుకు వెళ్లామని..న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగా  నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నానని బండి సంజయ్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తామని... అక్కడినుండే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. భైంసా ప్రజల నుండి బండి సంజయ్ ను దూరం చేయలేరని చెప్పారు.