అనగనగా సిరిపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో బడి, గుడి, తోటలు, పంట పొలాలు ఉన్నాయి. ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఊళ్లో ఉన్న బడిలో రామం అనే టీచర్ ఉన్నారు. అతనికి సీత అనే భార్య లవ, కుశ అనే పేర్లు గల ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లవ 9 వ తరగతి, కుశ 10వ తరగతి చదువుతున్నారు. ఆ పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరూ రోజు తోటకి తీసుకు వెళ్లేవారు. ఆ తోటలోకి అడుగుపెడితే పక్షులు కిలకిల రావాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ తోటలో రామచిలుకలు అటు ఇటు ఎగురుతూ ఉంటే మనసుకి ఆనందంగా ఉంటుంది.
లవ అనే వాడు బాగా చదివేవాడు. కుశకి చదవడం అంటే బద్ధకం. దానివల్ల 10వ తరగతి పాస్ కాలేదు. కుశుడి బద్దకాన్ని ఎలాగైనా వదిలించాలి అనుకున్నాడు తండ్రి రామం. ఆయన టీచర్ కూడా కావడం వల్ల కొడుకుని చదువు దారిలోకి తెచ్చే ప్రయత్నం మొదలుపెడతాడు. వాళ్ల కుటుంబానికి రోజూ తోటకి వెళ్లే అలవాటు ఉంది కదా! అలా ఒక రోజు తోటకి వెళ్లినప్పుడు అక్కడి నుండి ఒక రామచిలుకను ఇంటికి తెచ్చారు. దాన్ని ఒక పంజరంలో పెట్టి, దానికి గింజలు, పళ్ళు ఆహారంగా పెట్టేవాళ్లు. అలా ఆ చిలుకని చాలా బాగా చూసుకునేవాళ్లు. ఆ చిలుకకి అక్కడి సౌకర్యాలన్నీ బాగా నచ్చాయి. కావలసినంత తిండి కూడా దొరుకుతుంది. అదే తోటలో అయితే తిండి కోసం వెతుక్కోవాలి. ఇక్కడే బాగుంది అనుకుంది. దాంతో ఎగరడం, అటు ఇటు తిరగడం మానేసింది. ఆ చిలుకకి బద్దకం బాగా పెరిగిపోయింది. ఆ బద్ధకం ఏ స్థాయికి చేరుకుందంటే... పంజరం తలుపులు తీసి పెట్టినా బయటికి ఎగిరిపోకుండా కూర్చుంటోంది.
ALSO READ : నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు..
అప్పుడు రామం ఆ చిలుకకు రెండు రోజులు తిండి పెట్టలేదు. దాంతో ఆకలి విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా ఆ టైంకే అటుగా రామచిలుకలు గుంపులు ఎగురుతూ వెళ్లడం చూసింది. ఒక్కసారిగా బద్ధకాన్ని వదిలేసి ఆహారం కోసం పంజరం నుండి ఎగిరిపోయింది. అది గమనించిన కుశకి కళ్లు తెరుచుకున్నాయి. ఆ టీచర్ తండ్రి కొడుక్కి తెలివిగా చిలుక ఉదాహరణతో బద్దకం వల్ల కలిగే అనర్థం గురించి స్పష్టంగా చూపించగలిగాడు. అప్పటినుంచి కుశ మంచిగా చదవడం మొదలు పెట్టాడు. పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యాడు కూడా.
